Sat Mar 07 2026 16:17:36 GMT+0530 (India Standard Time)
Rain Alert : ఈరోజు కూడా వానలే.. కాస్త తగ్గినప్పటికీ?
మొంథా తుపాను ప్రభావంతో నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

మొంథా తుపాను ప్రభావంతో నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు పడతాయని, మిగిలిన అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్రమైన వాయుగుండంగా మారి తర్వాత అల్పపీడనంగా మారుతుందని ఆ ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోరెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.
మోస్తరు వానలే...
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు వానలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబరు 4వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడనుందని కూడా తెలిపింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదని, అయినా వానలు రెండురోజులు తప్పవని తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని చెప్పింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. అలాగే ఈరోజు తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, రాయలసీమ, కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
తెలంగాణలోనూ రానున్న...
తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే భారీ వర్షాలు కాకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తర తెలంగాణకు తుపాను ప్రభావంతో వానలు పడతాయని పేర్కొంది. అయితే వాగులు, నదులు పొంగి ప్రవహిస్తుండటంతో ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని, ఎవరూ సాహసం చేయవద్దని సూచించారు.
Next Story

