Thu Nov 30 2023 13:32:33 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రిలో హై అలర్ట్
రాజమండ్రిలో నేడు హై అలర్ట్ ప్రకటించారు. బాలకృష్ణ, పవన్, లోకేష్లు నేడు బాబుతో ములాఖత్ కానున్నారు

రాజమండ్రిలో నేడు హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు భారీగా మొహరించారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. అటు వైపు ఎవరినీ రానివ్వడం లేదు. కేవలం ములాఖత్ కు కొందరిని మాత్రమే అనుమతిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాకుండా జైలుకు రెండు కిలో మీటర్ల దూరం వరకూ నిషేధాజ్ఞలు విధించారు.
ముగ్గురు ములాఖత్...
ఈరోజు ముగ్గురు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన బావ చంద్రబాబును కలిసేందుకు ఇప్పటికే రాజమండ్రికి చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరారు. పదిగంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి చేరుకునే అవకాశముంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేష్ లు నేడు చంద్రబాబుతో ములాఖత్ కానుండటంతో జైలు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలుకు రెండు కిలో మీటర్ల దూరం వరకూ ఎవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.
భేటీ తర్వాత...
ఇప్పటికే ములాఖత్ కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు నలభై నిమిషాలు చంద్రబాబుతో భేటీ కానున్నారు. అరెస్ట్ తర్వాత తలెత్తిన పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యక్రమాలపై వీరు ముగ్గురు చంద్రబాబుతో చర్చించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తుంటే పోలీసులు ఆయనను వెనక్కు పంపారు. శాంతి భద్రతల దృష్ట్యా కుదరదని చెప్పారు. ఇప్పుడు కూడా పవన్, బాలకృష్ణ రాకతో జనసేన, టీడీపీ కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారనుంది. ములాఖత్ తర్వాత పవన్ ఏం మాట్లాడనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది,
Next Story