Sat Jul 27 2024 01:16:45 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లుండి ఢిల్లీకి జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు అర్థరాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకోనున్నారు.
![ys jaganmohan reddy, chief minister, tadepalli, today night ys jaganmohan reddy, chief minister, tadepalli, today night](https://www.telugupost.com/h-upload/2023/09/11/1540847-jagan-london.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో కొంత రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు అర్థరాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకోనున్నారు. గత కొద్దిరోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఈరోజు అర్థరాత్రికి విజయవాడకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమ కుమార్తెలు లండన్ లో చదువుకుంటుండటంతో ప్రతి ఏడాది జగన్ తన సతీమణితో కలసి లండన్ పర్యటనకు వెళ్తుంటారు
అర్ధరాత్రికి బెజవాడకు...
అందులో భాగంగానే ఆయన లండన్ వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 2వ తేదీన లండన్ కు వెళ్లిన జగన్ ఈరోజు అర్థరాత్రికి బెజవాడ చేరుకోనున్నారు. అయితే ఆయన ఎల్లుండి ఢిల్లీ వెళ్లే అవకాశముందంటున్నారు. ఢిల్లీ పర్యటనలో జగన్ ఎవరెవర్ని కలుస్తారన్న దానిపై ఇంతవరకూ స్పష్టత రాకపోయినా కేంద్రం పెద్దలను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి సంబంధించిన నిధులను విడుదల చేయడం, పోలవరం ప్రాజెక్టు నష్ట పరిహారం వంటి అంశాలపై జగన్ కేంద్రమంత్రులను కలసి చర్చిస్తారని తెలిసింది.
ఎమ్మెల్యేలతో భేటీ...
ఈరోజు అర్ధరాత్రి తాడేపల్లికి చేరుకోనున్న జగన్ రేపు రాష్ట్రంలో జరిగిన తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సమీక్షిస్తారని తెలిసింది. జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆయన వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారని తెలిసింది. రానున్న ఎన్నికల గురించి ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. అలాగే ఈ నెల రెండో వారంలోనే ఏపీ మంత్రి వర్గ సమావేశం కూడా జరగనుందని తెలిసింది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది.
Next Story