శుభ‌వార్త‌.. 'శుభ్‌మన్ గిల్' వ‌చ్చేస్తున్నాడు..!

భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు శుభవార్త రానుంది. భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈరోజు చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లనున్నాడు.

Update: 2023-10-11 05:06 GMT

భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు శుభవార్త రానుంది. భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈరోజు చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లనున్నాడు. అతడు BCCI వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. దీంతో అతడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. డెంగ్యూతో బాధపడుతున్న గిల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. అత‌డు చికిత్స కోసం చెన్నైలో ఉండ‌గా.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ కోసం మిగిలిన జట్టు ఢిల్లీకి బయలుదేరింది. తాజా స‌మాచారం ప్ర‌కారం గిల్ అహ్మదాబాద్‌కు వెళ్లి భారత జట్టులో చేరనున్నాడు. అక్కడ భారత్.. అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడ‌నుంది.

గిల్ ఆరోగ్యానికి సంబంధించి బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే గిల్ ఈరోజు అహ్మదాబాద్ చేరుకుంటారని.. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు కోలుకుంటున్నాడ‌ని మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

శుభ్‌మాన్ గిల్ డెంగ్యూతో బాధపడుతుండగా.. అతని శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరాడు. అయితే ఒక్క రాత్రి మాత్రమే ఉండి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇప్పుడు గిల్‌ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉండడమే పెద్ద సవాలు. అహ్మదాబాద్‌లో వన్డే మ్యాచ్‌లు ఆడాలంటే మంచి ఫిట్‌నెస్ అవసరం. తక్కువ ఫిట్‌నెస్ కారణంగా గిల్ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం కష్టం.

ఈ ఏడాది భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శుభ్‌మన్ గిల్. 20 ఇన్నింగ్స్‌ల్లో 1,230 పరుగులు చేశాడు. అతని సగటు 72.35 కాగా.. స్ట్రైక్ రేట్ 105.03. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. ప్రపంచకప్‌లో భారత్‌కు శుభ్‌మన్ గిల్ చాలా ముఖ్యమైన బ్యాట్స్‌మెన్. అహ్మదాబాద్‌లో గిల్‌ రికార్డు అద్భుతంగా ఉంది. అటువంటి పరిస్థితిలో అతడు జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు చాలా సంతోషకరమైన అంశం.

Tags:    

Similar News