World Cup 2023 Finals : ఏం చెప్పారు గురూ... వరల్డ్ కప్ లో భారత్ ఓటమికి కారణాలు ఇవా?

వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా పై ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ లీడర్లు తమ రాజకీయానికి వాడుకుంటున్నారు

Update: 2023-11-23 05:43 GMT

వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా పై ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కల చెదిరింది. అప్పటి దాకా వరస విజయాలతో ఫైనల్స్ లోకి దూసుకు వచ్చిన టీం ఇండియా ఇలా ఫైనల్స్ లో ఓడిపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి బ్యాటర్లు, బౌలర్లు విఫలమవ్వడం కూడా ఒక రీజన్. ఆటలో ఎవరైనా గెలవచ్చు. ఆస్ట్రేలియా ఆరోజు బాగా ఆడింది. భారత్ బాగా ఆడినా ముందుగా బ్యాటింగ్ చేసి అనుకున్న పరుగులు చేయలేకపోయింది. అప్పటి వరకూ అందరూ ఫామ్ లో ఉన్నవారే. కానీ వత్తిడితో కూడా అలా జరిగి ఉండవచ్చు. లేక పిచ్ కారణం కావచ్చు. కారణమేదైనా వరల్డ్ కప్ లో ఓటమి పాలు కావడాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.

మోదీ రావడం వల్లనే...
అయితే భారత్ ఓటమిని కూడా ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇది వినేవాళ్లకు చాలా అసహ్యంగా ఉంది. రాజకీయాలను క్రికెట్‌కు అనుసంధానించి కామెంట్స్ చేయడం ఎంత వరకూ సబబు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ ఓటమికి కారణాలు చెప్పారు. ఆరోజు శని స్టేడియంలోకి రావడం వల్లనే భారత్ ఓటమి పాలయిందని చెప్పారు. మోదీ ఫైనల్స్ కు హాజరు కావడాన్ని ఆయన ఆ విధంగా రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం పై నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి. ఆటకు సెంటిమెంట్ రాస్తే జనం నమ్ముతారా? అలా నమ్మించి ఓట్లు దండుకోవాలనేనా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది.
ఈ సీఎం కామెంట్స్ విన్నారా?
అలాగే సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు 2011లో సోనియా, రాహుల్ హాజరైతే గెలిచామని, ఇప్పుడు మోదీ హాజరైతే ఓడామని చెబుతూ ఫొటోలు పోస్టులు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఇందుకు బీజేపీ నేతలు కూడా మినహాయింపు కాదు. వరల్డ్ కప్ లో భారత్ ఓటమికి ప్రధాన కారణం నవంబరు 19 అని అస్సాం ముఖ్యమంత్రి హింత బిశ్వశర్మ అనడం కూడా అంతే సిగ్గు చేటయిన విష‍యం. ఆరోజు ఇందిరా గాంధీ పుట్టిన రోజు అట. అందుకే భారత్ ఓడిపోయిందంటున్నారు ఈ ముఖ్యమంత్రి. గాంధీ కుటుంబ సభ్యులు పుట్టినరోజు నాడు అసలు మ్యాచ్ లు పెట్టొద్దనే ఆయన కోరుతున్నారు. ఇలా క్రికెట్ ను కూడా తన రాజకీయంగా వాడుకుంటూ పొలిటికల్ లేడర్స్ గేమ్ ఆడుతుండటం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా భారత్ ఓటమికి గల కారణాలు వేరు. సెంటిమెంట్లు కాదన్నది నిజం అని తెలుసుకుంటే మంచిది.




Tags:    

Similar News