నా పేరు సూర్యపై కుట్ర జరుగుతుందా ...?

Update: 2018-04-30 00:45 GMT

వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన తొలిచిత్రం నా పేరు సూర్య పై భారీ కుట్ర జరుగుతుందా ..? ఈ సినిమా విడుదలైన వెంటనే నెగిటివ్ టాక్ వచ్చేలాగా పైరసీ వెంటనే విడుదల అయ్యేలా తెరవెనుక ఇది నడుస్తుందా ? ఇవి అనుమానాలు కాదు నిజం అంటున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. నా పేరు సూర్యా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ ఈ బాంబు పేల్చారు. స్టైల్స్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు కుట్రను గమనించాలంటూ కూడా పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ మీద నడుస్తున్న అంశాల నేపధ్యం ఆ తరువాత జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ అల్లు అరవింద్ ఉద్వేగంగా మాట్లాడారు. బన్నీ టెన్షన్ పడొద్దని ఆ విషయాలు నీకు తరువాత చెబుతానంటూ అల్లు అరవింద్ ట్విస్ట్ ఇవ్వడం ఈ కార్యక్రమంలో చర్చనీయాంశం అయ్యింది.

మామ ను సమర్ధించిన రామ్ చరణ్ ...

సాధారణంగా తన మామ అల్లుఅరవింద్ ఏ వివాదంలోకి వెళ్ళే వ్యక్తి కాదని కానీ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎంతో బాధ దాగివుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి రామ్ చరణ్ అన్నారు. ప్రపంచంలో అవినీతి లేని పరిశ్రమ ఏదన్నా వుంది అంటే అది కేవలం చిత్ర పరిశ్రమ అన్నది గుర్తించాలని కోరారు. అయితే ఈ పరిశ్రమ పై అదే పనిగా తప్పుడు ప్రచారాలు నడుస్తున్నాయని కొందరు మీడియా వారు చేస్తున్న పని పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ పోరాటానికి మద్దతుగానే మెగా కుటుంబం

ఎల్లో మీడియా పై జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతుగానే మెగా కుటుంబం నిలిచినట్లు నా పేరు సూర్య కార్యక్రమం చాటి చెప్పింది. ఈ చిత్రం ప్రి రిలీజ్ హక్కులు ఎన్టీవీ, ఆదిత్య కు మాత్రమే ఇచ్చారు. మిగిలిన మీడియాను దూరం పెట్టారు. దాంతో నా పేరు సూర్య చిత్రాన్ని ప్లాప్ గా చూపేందుకు తెరవెనుక కొందరు మీడియా అధినేతలు కుట్ర చేస్తున్నారన్న సమాచారం అరవింద్ కి లీక్ అయ్యిందంటున్నారు. ఈ కీలక అంశాన్ని ముందే అభిమానులకు ప్రేక్షకులకు చేరవేయడం ద్వారా అరవింద్ రాబోయే ప్రమాదానికి చాలా వరకు ముందు చూపుతో బ్రేక్ వేశారు. మరి మే 4 న విడుదల కానున్న నా పేరు సూర్య చిత్రం ఎలా ఉండబోతుంది అన్న అంశం కన్నా పవన్ ను వ్యతిరేకిస్తున్న మీడియా చూపించే టాక్ ఎలా ఉంటుందో అన్న అంశం మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Similar News