ఘోర ప్రమాదం....ఐదుగురి మృతి

Update: 2017-10-01 04:36 GMT

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు ఆర్టీసి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అవనిగడ్డ నుంచి హైదరాబాద్‌ వెళుతోన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆర్టీసి బస్సు వేగంగా దూసుకుపోవడంతో బస్సు డ్రైవర్‌తో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ సూర్యాపేట ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 6 గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మృతుల్ని గుర్తించారు. ప్రయాణికులు అంతా అవనిగడ్డ., దివిసీమ ప్రాంతాలకు చెందిన వారేనని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని కోదాడ నుంచి హైదరాబాద్‌ తరలించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని గుర్తించకపోవడం., చివరి నిమిషంలో బస్సును పక్కకు తిప్పేందుకు డ్రైవర్‌ ప్రయత్నించడంతో మృతుల సంఖ్య తగ్గినట్లు ఘటనా స్థలం కనిపిస్తోంది. బస్సు ఎడమ వైపు మొత్తం ధ్వంసమైపోయింది. లారీని రాసుకుంటూ వెళ్లడంతో ఎడమ పక్క కూర్చున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రమాదంపై ఏపీ సిఎం చంద్రబాబు., డిప్యూటీ స్పీకర్‌ బుద్దప్రసాద్‌ దిగ్బ్రాంతి విచారం వ్యక్తం చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Similar News