ఏటీఎంను తగులబెట్టి.. 17 పేజీల నోట్‌‌ను వదిలి...?

Update: 2018-02-12 05:59 GMT

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటియంను ఓ గుర్తు తెలియని వ్యక్తి తగులబెట్టాడు. అనంతరం అదే ఏటీఎం దగ్గర ప్రపంచంలో మానవ సమస్యలపై సలహాలు...సూచనలతో కూడిన 17 పేజీల నోట్ ను విడిచి వెళ్లాడు. అంతేకాదు ఆ నోట్‌‌లోని విషయాలను మీడియా ప్రచురించక పోతే ఆత్మహత్యకు పాల్పడుతానని బెదిరింపు లేఖ కూడా రాసిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఏటీఎంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో అటుగా వెళ్తున్న జనాలు పోలీసులు సమాచారం అందించారు.!

ఏటీఎంలో రూ.70 వేలు.....

కాగా అప్పటికే మంటల్లో ఏటీఎం కాలిపోయింది. ఏటీఎంలో సుమారు రూ.70వేలు దాకా ఉన్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే ఏటీఎంలో డబ్బులుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరు? నోట్‌‌లో ఏముంది? నగరానికి చెందిన వ్యక్తే ఇలా చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News