వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Update: 2018-11-09 13:05 GMT

కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పెడన నేతలు జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాలు శుక్రవారం రోడ్డుపైనే బాహాబాహీకి దిగాయి. మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ కన్వీనర్ గా బాలశౌరి ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెడన నేతలు జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ లు తమ అనుచరులతో కలిసి హాజరయ్యారు. ర్యాలీ పెడన వద్దకు చేరుకోగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

దాడులు...ప్రతిదాడులు.....

దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జోగి రమేష్ కారు అద్దాలను ఉప్పాల వర్గీయులు ధ్వంసం చేశారు. ఉప్పాల రాంప్రసాద్ కుమారుడు ఉప్పాల రాముకి గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, ఈ సంఘటన పట్ల పార్టీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన వారు ఇలా దాడులు చేసుకోవడంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News