నువ్వెంత...?......నీ బతుకెంత....?

Update: 2018-11-26 08:41 GMT

నీ బతుకెంత? నువ్వెంత? అంటూ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై చిందులు తొక్కారు. పాస్ పోర్ట్ కుంభకోణం నుంచి అన్ని తప్పుడు విధానాలనే కేసీఆర్ అవలంబించారన్నారు. మీట్ ది ప్రెస్ లో ఉత్తమ్ మాట్లాడారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణా వచ్చేదా? అన్నవిషయాన్ని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సూటిగా చెప్పాలన్నారు. నిమ్స్ లో దొంగ దీక్ష చేసి, గత ఎన్నికల్లో సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చావన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు.

చంద్రబాబు అడ్డుకున్నారా?

డబుల్ బెడ్ రూం ఇళ్లు కడతానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా? దళితులకు మూడు ఎకరాలు ఇస్తానంటే బాబు అడ్డుకున్నారా? తెలపాలని ఉత్తమ్ సూటిగా ప్రశ్నించారు. సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. సోనియా నిజాయితీ, పట్టుదల వల్లనే తెలంగాణ కల సాకారమయిందన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉత్తమ్ టిక్కెట్లు అమ్ముకున్నారని కేసీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. నాలుగున్నరేళ్లలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అబద్ధాలు నిజంగా చెప్పడం కేటీఆర్, కేసీఆర్ లకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Similar News