ఈ ఫొటో వెనక ఉన్న అసలు కధ ఇదీ

సోషల్‌ మీడియాలో కొంతకాలంగా ప్రతీదీ వింత అయిపోయింది. ఏ ఒక్క ఫోటో విభిన్నంగా కనిపించినా.. ఏ చిన్నపాటి వీడియో చూసినా ఎవరి ఆలోచనలకు తగ్గట్లు, ఎవరి వైఖరికి [more]

Update: 2019-10-30 14:05 GMT

సోషల్‌ మీడియాలో కొంతకాలంగా ప్రతీదీ వింత అయిపోయింది. ఏ ఒక్క ఫోటో విభిన్నంగా కనిపించినా.. ఏ చిన్నపాటి వీడియో చూసినా ఎవరి ఆలోచనలకు తగ్గట్లు, ఎవరి వైఖరికి తగ్గట్టు వాళ్లు అన్వయించుకుంటున్నారు. సొంత కామెంటరీని జోడించి వైరల్‌ చేస్తున్నారు. అది చివరి యూజర్‌కు చేరుకునే సరికి పూర్తి స్వరూపమే మారిపోతోంది. రెండు రోజుల క్రితం ఓ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. పూర్వ కరీంనగర్‌ జిల్లా ఇప్పటి పెద్దపల్లి జిల్లా పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంథనిలో ఇసుకను డబ్బాల చొప్పున అమ్ముతున్న దృశ్యమది. రెండు రోజులు తిరిగేసరికి ఆ ఇసుక అమ్మకం ఫోటోకు సవాలక్ష సొంత కామెంట్లు జోడయ్యాయి. రాష్ట్రం ఎల్లలు కూడా దాటిపోయాయి. రాజకీయ రైటప్‌లూ తోడయ్యాయి. చివరకు ఆ ఫోటో ఎక్కడిదో, ఎందుకు అలా అమ్మాల్సి వచ్చిందో అన్న అసలు సంగతి మరుగున పడిపోయింది.

నోముల కోసం…..

తెలంగాణలో దీపావళి సీజన్‌. దీపావళి పండుగ మొదలుకొని.. కార్తీకపౌర్ణమి దాకా కేదారేశ్వరస్వామి నోములు, వ్రతాలు జరుపుకోవడం ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, పట్టణ ప్రాంతాల్లో చూసినా దాదాపు 70శాతం మంది కేదారేశ్వరస్వామి నోము నోచుకుంటారు. ఆ వ్రతంలో భాగంగా.. పవిత్రమైన నోము పాత్రలను గొలుసు (పారేనీళ్లలో అడుగున ఉండే ఇసుక) పైన ఉంచుతారు. ఏడాది పాటు.. అత్యంత పవిత్రంగా ఉట్టిమీద ఉంచే నోము కుండలను కిందికి దింపి.. పారే నీళ్లలో నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇసుకపైనే ఉంచుతారు. కింద అసలు పెట్టరు. అది ఇక్కడి సంప్రదాయం. గోదావరి పరీవాహకం ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోని జనం గోదావరి ప్రవాహంలోని ఇసుకను నోము నోచుకునే రోజు ఉదయాన్నే నదీస్నానమాచరించి తీసుకొచ్చి నోము కుండల కింద పేర్చుతారు. అయితే.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కాళేశ్వరం నుంచి మొదలుకొని ఎగువన గోదావరిఖని , శ్రీపాద సాగర్‌ ప్రాజెక్టు దాకా గోదావరి నిండుకుండలా ఉంది. గతంలో అయితే.. ఈ సమయంలో పాయలు పాయలుగా ప్రవాహం ఉండేది. ఇప్పుడు పూర్తిగా గోదావరి నిండిపోవడంతో.. ఈ సంస్కృతి, సంప్రదాయం గురించి తెలిసిన మంథని ఆవల మంచిర్యాల జిల్లా, మహారాష్ట్రకు చెందిన కొందరు.. అక్కడి నదులు, ఏరులలో ఇసుకను తీసుకొచ్చి.. నోము పాత్రలకోసం చిన్నడబ్బా ఇసుక రూ.10 చొప్పున అమ్మారు. ఇదండీ సంగతి. ఫేస్ బుక్ లో ఒక పాత్రికేయుడు పెట్టిన పోస్టింగ్ ఆధారంగా…..

Tags:    

Similar News