నాయినిని ఇరికిస్తున్న రేవంత్ రెడ్డి

Update: 2018-10-13 07:47 GMT

టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూసే కాంగ్రెస్ నేతల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు. వ్యక్తిగతంగానో, రాజకీయంగానో కానీ టీఆర్ఎస్ నేతలపై రేవంత్ కక్ష కట్టినట్లుగా ఆయన చర్యలు కనిపిస్తాయి. ఇలా ఆయన పలువురిపై ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పించారు. తాజాగా, ఆయనకు టీఆర్ఎస్ ముఖ్య నేత నాయిని నరసింహారెడ్డి చిక్కారు. ఇటీవల నాయిని మీడియాతో మాట్లాడుతూ... ఎల్బీనగర్ నుంచి తాను పోటీ చేస్తానంటే కేసీఆర్ రూ.10 కోట్లు ఖర్చు కోసం ఇస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పలు పత్రికల్లో కూడా వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి వెంటనే అందుకున్నారు. నాయిని వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని నిన్న రేవంత్ డిమాండ్ చేశారు. ఇవాళ ఏకంగా ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందో లేదో కానీ నాయిని మాత్రం పార్టీ పెద్దల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

Similar News