చంద్రబాబుపై పవన్ ఘాటు విమర్శలు

Update: 2018-05-16 08:14 GMT

చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు హైవే రోడ్డు పనుల్లో భాగంగా భూసేకరణ కింద భూములను కోల్పోతున్న శెట్టిపల్లి గ్రామ రైతులను పవన్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... శెట్టిపల్లిలో జరుగుతున్న అన్యాయాన్ని స్థానికులు, యువత ఎదుర్కొవాలని, తిరగబడాలన్నారు. మీకు జనసేన అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అవసరానికి మించి ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకునే టీడీపీకి ఇక్కడ సన్న, చిన్నకారు రైతులకు చెందిన 600 ఎకరాల భూమికి కాపాడే తెలివి లేదా అని ప్రశ్నించారు. టీడీపీ ఓట్లేసిన ప్రజలను వంచనకు, వివక్షకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొందరు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వ్యవసాయం చేసుకుని బతికే సన్నకారు రైతులకు అన్యాయం చేస్తామనడం దారుణమన్నారు. అనుభవమున్న నేత రాష్ట్రానికి అవసరమని, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చామని, కానీ టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలను మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.

Similar News