30 సంవత్సరాల పాటు తనకు రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. ఇందుకోసం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటానని, ప్రతి ఇంట్లో చనిపోయాక తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండేలా పాలన చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో జగన్ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. అనంతపరం పట్టణంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు భారీగా జనసందోహం హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు వ్యవసాయంపై కేంద్ర హోంమంత్రి అవార్డు ఇస్తున్నారని... ఆయనకు అవార్డు ఇవ్వడం అంటే తాగి వచ్చి భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అవార్డు ఇవ్వడమేనని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్నుందుకు చంద్రబాబుకు ఉత్తమ ఛీటర్ అవార్డు ఇవ్వాలని పేర్కొన్నారు.