రూల్ అంటే రూలే...అది ఎవరికైనా... అని కేరళలో నిరూపితమైంది. కేరళ గవర్నర్ పి.సదాశివం తన కారుకు ఫైన్ కట్టి తానేమీ నిబంధనలకు అతీతుడిని కాదు అని నిరూపించారు. ఇటీవల కేరళ గవర్నర్ కి చెందిన బెంజి కారు కౌడియర్ రోడ్డులో గంటలకు 80 కి.మీ వేగంతో వెళ్లింది. అయితే, ఈ రోడ్డులో గంటకు 55 కి.మీ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లవద్దనే నిబంధన ఉంది. వేగాన్ని నమోదు చేసేందుకు స్పీడ్ డిటెక్టార్ సెన్సార్లు కూడా ఉన్నాయి. దీంతో గవర్నర్ కారు నిబంధనలను అతిక్రమించినట్లు నమోదైంది. అయితే, ఆ సమయంలో కారులో గవర్నర్ లేరు. మొదట పైన్ వేసేందుకు అధికారులు జంకినా, తర్వాత రూ.400 ఫైన్ వేశారు. దీంతో పైన్ విషయం తెలుసుకున్న గవర్నర్ డబ్బు చెల్లించాలని ఆదేశించడంతో సిబ్బంది ఫైన్ కట్టారు. మొత్తానికి వీఐపీలకు రూల్స్ ఉండవు అనే ఓ నానుడిని గవర్నర్ ఆయన వరకైతే తప్పని నిరూపించారు.