బ్రేకింగ్ : డీఎస్ కుమారుడిపై లైంగిక వేదింపుల ఆరోపణలు

Update: 2018-08-02 13:09 GMT

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పై లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి. సంజయ్ నిజామాబాద్ లో శాంకరీ నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్నాడు. కళాశాలలో చదివే విద్యార్థినులను సంజయ్ లైంగికగా వేదిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థినులతో పాటు, పీఓడబ్లూ నాయకురాలు సంధ్య గురువారం హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు ఉండే హాస్టల్ లోకి చొరపడటం, విద్యార్థినులను అతడు ఓ మహిళతో సహజీవనం చేసే ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేదించాడని వారు ఫిర్యాదు చేశారు. దీంతో నాయిని వెంటనే డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. వెంటనే విచారణ జరపాలని సూచించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

ధర్మపురం సంజయ్ గురించి నిజామాబాద్ మొత్తం తెలుసని పీఓడబ్లూ నాయకురాలు సంధ్య పేర్కొన్నారు. కళాశాలకు చెందిన 12 మంది పేద, మధ్య తరగతి విద్యార్థినుల పట్ల సంజయ్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఉద్యోగం త్వరగా వస్తుందని నర్సింగ్ లాంటి కోర్సులో చేరిన పేదింటి విద్యార్థినులపై దుర్మార్గంగా ప్రవర్తించిన సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినులకు నష్టం కలగకుండా వేరే కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Similar News