ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సోమవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చారు. విభజన చట్టం అమలు, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలపై ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపుమేరకే ఉండవల్లి సచివాలయానికి వచ్చారు.
గుంటూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సచివాలయానికి వచ్చిన తర్వాత ఉండవల్లి ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అంశాలవారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేసే ఉండవల్లి చంద్రబాబుతో బేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. 2014కి ముందు ఎంపీగా పనిచేసిన ఉండవల్లికి విభజన చట్టం, హామీలపై మంచి అవగాహన ఉంది. ఈ మేరకు విభజన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఉండవల్లి అభిప్రాయం తీసుకునేందుకు సీఎంఓ వర్గాలు ఆయనను సచివాలయానికి పిలిచినట్లు తెలుస్తోంది.