సంచలనం సృష్టిస్తున్న ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’

ఓ వివాదాస్పద పుస్తకం ఆధారంగా… వివాదాస్పద టైటిల్ తో తెరకెక్కుతున్న ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. మాజీ ప్రధాని [more]

Update: 2018-12-28 08:39 GMT

ఓ వివాదాస్పద పుస్తకం ఆధారంగా… వివాదాస్పద టైటిల్ తో తెరకెక్కుతున్న ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా పనిచేసిన తెలుగు వ్యక్తి సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో మన్మోహన్ పాత్ర పోషించారు. జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ట్రైలర్ లో సోనియా గాంధీ, గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ సినిమాను తెరకెక్కించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముందు ఈ చిత్రాన్ని తమకు చూపించాకనే విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ను, సోనియా గాంధీని కించపరిస్తే చిత్రాన్ని అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇక మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్ణయించింది.

మన్మోహన్ ను కీలుబొమ్మను చేసి…

2004 – 2014 వరకు యూపీఏ ప్రభుత్వం హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా కేవలం కీలుబొమ్మనే అని, సోనియా గాంధీ.. మన్మోహన్ ను అడ్డుపెట్టుకుని అధికారం చలాయించారనే విధంగా ట్రైలర్ లోని సన్నివేశాలు ఉన్నాయి. చిత్ర కథ కూడా అదే అని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ పై సోనియా గాంధీ ఒత్తిడి తెచ్చి ఆమెకు నచ్చిన నిర్ణయాలు అమలు చేయించే వారని, మన్మోహన్ సింగ్ ఓ దశలో రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని ట్రైలర్ లో చూపించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఈ సినిమాపై భగ్గుమంటున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం టైటిలే పెద్ద వివాదం. అప్పట్లో మన్మోహన్ ను ఉద్దేశించి ఓ అమెరికా పత్రిక ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అప్పుడే వివాదం రేగింది. తర్వాత ఇదే టైటిల్ తో సంజయ్ బారు పుస్తకం రాశారు. సంజయ్ బారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. మీడియా సలహాదారు గానే కాకుండా మన్మోహన్ సింగ్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. యూపీఏ హయాంలో అంతర్గతంగా జరిగిన అన్ని పరిణామాలూ ఆయనకు తెలుసు. వీటినే ఆయన పుస్తకంలో పొందపరిచారు.

సంజయ్ బారు పుస్తకం ఆధారంగా…

సంజయ్ బారు రాసిన ఈ పుస్తకం ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ ను, గాంధీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనేది కాంగ్రెస్ వాదన. అనుపమ్ ఖేర్.. మన్మోహన్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన హావభావాలు మన్మోహన్ ను అచ్చుగుద్దినట్లు ఉన్నాయి. ఈ సోనియా గాంధీ పాత్రలో ఆంగ్ల నటి సుజానే, సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ఇక, కాంగ్రెస్ ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తుంటే… బీజేపీ మాత్రం భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటోందని, జరిగిన చరిత్ర చెబుతుంటే అడ్డుకోవడం సరికాదని అంటోంది. మొత్తానికి ఎన్నికల వేళ ఈ చిత్రం జాతీయ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది.

Tags:    

Similar News