Ap Elections : ఈ సర్వేలు నిజమవుతాయా? అలాగయితే ఏపీలో గెలుపు ఖచ్చితంగా వారిదేనా?

ఎన్నికలకు ముందు సర్వేలు రావడం సహజం. పేరున్న సంస్థలతో పాటు కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా సర్వేలు చేస్తుంటాయి

Update: 2024-04-17 12:36 GMT

ఎన్నికలకు ముందు సర్వేలు రావడం సహజం. పేరున్న సంస్థలతో పాటు కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా సర్వేలు చేస్తుంటాయి. ప్రజల మూడ్ తెలుసుకోవడంతో పాటు ఆ నియోజకవర్గంలో ఓటర్లలో ఎక్కువ మంది ఎటువైపు మొగ్గు చూపుతారో ఒక అంచనాకు వస్తారు? ఏపీ ఎన్నికలను తీసుకుంటే ఏ సర్వే సంస్థ ఐదు కోట్ల మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించదు. అది ఎంత మాత్రం సాధ్యం కాదు కూడా. అందుకే ప్రతి సర్వే సంస్థ శాంపిల్ సర్వేలను మాత్రమే నిర్వహిస్తాయి. అంటే నియోజకవర్గానికి వందో.. వెయ్యో.. ఇలా.. ముందుగా నిర్ణయించుకుని ఆ ప్రాంతాలలో సర్వే చేయడం సర్వే సంస్థలు చేస్తుంటాయి.

ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని...
అలాగే ప్రతి గ్రామంలో సర్వే చేయడం అనేదికూడా ఏ సంస్థకు సాధ్యం కాదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంచుకున్న గ్రామాలకే సర్వే సంస్థ ప్రతినిధులు వెళ్లి సర్వేలు చేస్తుంటాయి. ఇటీవల కాలంలో ఫోన్ల ద్వారా కూడా సర్వే సంస్థలు ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈసర్వే ఫలితాలు పెద్దగా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని ఏ సంస్థ సేకరించలేదన్నది అందరికీ తెలిసిందే. కేవలం ప్రజల మూడ్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని గతంలో వచ్చిన ఓట్లు.. ఈసారి వివిధ కారణాలతో పెరగనున్న ఓట్లు.. లేకుంటే తగ్గనున్న ఓట్లు అంటూ లెక్కలు వేసి సర్వే ఫలితాలు వెల్లడిస్తాయి.
రాజకీయ పార్టీలకు అనుబంధంగా...
అయితే ఇటీవల కొన్ని పెద్ద సంస్థలు కూడా రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతుంటాయన్నది గతంలో జరిగిన సర్వేల్లో వెల్లడయింది. కొన్ని సంస్థలు ఖచ్చితమైన సర్వేలు అందచేస్తున్నప్పటికీ, మరికొన్ని మాత్రం కేవలం రాజకీయ పార్టీతో ఉన్న అనుబంధం కారణంగా ప్రజల మనసును ఛేంజ్ చేయడానికి తమ ఫలితాలు ఉపయోగపడతాయని ఎన్నికలకు ముందు ఇలా జిమ్మిక్కులు చేస్తుండటమూ సహజమే. అయితే పోలింగ్ రోజు చేసే ఎగ్జిట్ పోల్స్ లో కొంత నిజమయ్యే అవకాశముందని గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత అయితే ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పే అవకాశముందని, అందుకోసమే ఎగ్జిట్ పోల్స్ వరకూ ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వేస్తాయన్నది చెప్పవచ్చు.
ఈసారి ఎగ్జిట్ పోల్స్...
అయితే ఈసారి ఏపీలో పోలింగ్ జరిగే మే 13వ తేదీన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించే అవకాశం లేదు. ఎందుకంటే నాలుగో దశలో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయకూడదు. దేశంలో ఆఖరి విడత జరిగే జూన్ రెండో తేదీన మాత్రమే ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. మరో రెండు రోజుల్లో జూన్ నాలుగో తేదీన అధికారిక ఫలితాలు వెల్లడవుతాయనగా రెండు రోజుల ముందు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పటి వరకూ వెల్లడయిని సర్వేలు ఎంత వరకూ ప్రజల మనసులో అభిప్రాయాలు ఖచ్చితంగా వెల్లడిస్తాయన్నది మాత్రం అనుమానమే.


Tags:    

Similar News