Communist :కమ్యునిస్టులు ఈసారి దెబ్బేస్తారా? ఎవరి ఓట్లకు గండిపడనుంది?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కమ్యునిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ పార్టీతో కలసి పొత్తు పెట్టుకున్నాయి

Update: 2024-04-12 12:32 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఈసారి కమ్యునిస్టు పార్టీలైన సీీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ పార్టీతో కలసి పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలసి ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కన్నా కమ్యునిస్టుల బలం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అవుతాయోమో కాని, కమ్యునిస్టులు ఓట్లు మాత్రం సాలిడ్ గా ఆ పార్టీ అభ్యర్థులకే పడతాయి. అందుకే ఇప్పుడు ఏపీలో కమ్యునిస్టుల ప్రభావం ఏఏ నియోకవర్గాల్లో ఉంటుందన్న చర్చ జరుగుతుంది.

బీజేపీకి దెబ్బేనా?
విజయవాడ నగరంలో కమ్యునిస్టులు బలంగానే ఉన్నారు. వాళ్లు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కొన్ని వార్డులను కైవసం చేసుకున్నారు. ఈసారి రెండు పార్టీలూ విజయవాడ నగరం పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సీపీఐ బలంగా ఉంది. అక్కడ ఈ ఎన్నికల్ల ప్రస్తుతం సీపీఐ పోటీకి దిగుతుంది. గతంలోనూ ఇక్కడ నుంచి సీపీఐ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాసర్ వలి, సుబ్బరాజు వంటి వారు ఎన్నికయ్యారు. దీంతో ఈసారి బీజేపీ అభ్యర్థి ఓట్లకు కమ్యునిస్టులు గండి కొట్టే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఓట్లు కనీసం చీల్చితే అది చివరకు బీజేపీ అభ్యర్థి విజయంపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
బెజవాడ నగరంలో...
అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా సీహెచ్ బాబూరావు సీపీఎం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈయన కూడా ప్రభావం చూపేనేత. ఆయన సామాజికవర్గం పరంగా కూడా కొంత ప్రభావం చూపగలిగిన నేత కావడంతో సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరికి దెబ్బ పడుతుందన్న అంచనాలు మాత్రం పైకి అందడం లేదు కానీ, వైసీపీ, టీడీపీలకు మాత్రం ఇక్కడ ఆయన షాక్ ఇచ్చే అవకాశముంది. అలాగే పక్కనే ఉన్న గన్నవరం నుంచి కూడా కమ్యునిస్టులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గెలిచిన నియోజకవర్గం కావడంతో కమ్యునిస్టుల ఓట్లు చీలిపోతే ఎవరికి నష్టం అన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
మంగళగిరిలోనూ...
అదే సమయంలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా కమ్యునిస్టులు బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కూడా వాళ్ల ప్రభావాన్ని తీసిపారేయలేం. ఇక్కడా కమ్యునిస్టుల గతంలో గెలిచారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నాయి. అయితే కమ్యునిస్టులు ఎంత మేరకు ఓట్లు చీలుస్తారన్నది మాత్రం తెలియడం లేదు. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థులు గుండెల్లో మాత్రం ఎర్ర జెండాలు భయం పుట్టిస్తున్నాయి. అలాగే రంపచోడవరం వంటి ప్రాంతంలోనూ కమ్యునిస్టు ఓట్లు చీలితే దాని ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుందన్న దానిపై వైసీపీ, టీడీపీలు ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటున్నాయి. మొత్తం మీద తాము గెలవలేకపోయినా... ఓడించే సత్తా మరి ఎర్రన్నలకు ఉందా? అన్నది మాత్రం ఫలితాల తర్వాతనే తెలియనుంది.



Tags:    

Similar News