Ys Jagan : ఢిల్లీ మెకానిక్ లు సైకిల్ రిపేర్ కోసం ఇక్కడికి దింపారు.. తుప్పపట్టిన సైకిల్ లో పనిచేసేది ఒక బెల్ మాత్రమే

ఇంతగా పేదవాడి కోసం పరితపించే ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడైనా చూశారా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

Update: 2024-05-07 06:55 GMT

ఇంతగా పేదవాడి కోసం పరితపించే ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడైనా చూశారా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాజానగరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తాయని తెలిపారు. టీడీపీకి ఓటు వేస్తే ఒక్క పథకం కూడా అందదని తెలిపారు. సంక్షేమ పథకాలను ముగించేస్తారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫేస్టోలో 99 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. గతంలో ఎప్పుడైనా ఇలా మ్యానిఫేస్టోను అమలు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. అవ్వాతాతలకు ఇంటికే పింఛనును మూడు వేల రూపాయలు గతంలో ఎవరైనా ఇచ్చారా? అని అడిగారు.

సైకిల్ కు రిపేర్ వస్తే...
పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకమైనా పేదవాడి కోసం చంద్రబాబు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రభుత్వ పాలనలో పేదలను పట్టించుకోవడం లేదన్నారు. తుప్పు పట్టిన సైకిల్ కు రిపేర్ చేయాలని ఎంతగానో కష్టపడ్డారన్నారు. ముందు ఎర్రచొక్కాల వద్దకు వెళ్లాడన్నారు. దత్తపుత్రుడు సైకిల్ వెనక క్యారేజీ పైనే కూర్చుంటాడని చెప్పాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపి రాయబారాలు నడిపారన్నారు. ఆ సైకిల్ కు చక్రాలు, ట్యూబ్ లు, బ్రేకుల్లేవని బీజేపీ నేతలు అడిగితే ఇదొక్కటే మిగిలింది అంటూ బెల్లు కొట్టడం మొదలుపెట్టాడన్నారు. ఆ బెల్లు పేరే అబద్ధాల మ్యానిఫేస్టో అని వైఎస్ జగన్ అన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ...
మ్యానిఫేస్టో లో చెప్పిన అంశాలు చంద్రబాబు ఎప్పుడూ అమలు చేయరన్నారు. 2014 లో ఇచ్చిన ముఖ్యమైన హామీలు ఏవీ అమలు చేయలేదన్నారు. గెలిచిన తర్వాత మ్యానిఫేస్టోను కనిపించకుండా చేయడంలో కూడా చంద్రబాబును మించిన వారు మరెవరూ ఉండరన్నారు. మళ్లీ ఇదే ముగ్గురు మరోసారి డ్రామా ఆడుతున్నారని, వారిని నమ్ముతారా? అని ప్రశ్నించారు. అబద్ధాలు, మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే వాటిని చూసి నమ్మితే మరోసారి మోసపోయినట్లేనని అన్నారు. అవ్వాతాతలకు పింఛను రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. రైతులకు, తల్లులకు దక్కాల్సిన పథకాలను కూడా రానివ్వకుండా చూశారన్నారు. మళ్లీ మీ జగన్ వస్తాడని, పథకాలన్నీ ఇంటికి చేరుస్తానని జగన్అన్నారు.


Tags:    

Similar News