Sat Dec 13 2025 22:35:53 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : అమరావతికి మరో 16 వేల భూమి సమీకరణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 16,660 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. వివిధ ప్రయివేటు సంస్థలు, పరిశ్రమలు రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నందున వారికి అవసరమైన భూములు ఇవ్వడానికి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ వంటి సదుపాయాలను కల్పించేందుకు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అవసరమని భావిస్తుంది.
త్వరలో నోటిఫికేషన్...
ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వచ్చేలా రాజధాని రైతులను ఒప్పించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాగే మొదటి దశలో 34 వేల ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించింది. ఇప్పుడు మరో పదహారు వేలు సేకరిస్తే, ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 70 వేల ఎకరాల్లో నూతన రాజధాని అమరావతిని నిర్మించాలని చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. రైతులకు అవగాహన కల్పించేలా ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలని కోరారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగూరు నారాయణ మీడియాకు వెల్లడించారు.
Next Story

