నిద్ర రావడం లేదే....!!!
తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనా సంక్లిష్టంగా మారింది. ఒకవైపు జాతీయ ఛానెళ్ల అంచనాలు, స్థానిక సర్వేల నేపథ్యంలో అన్ని పార్టీల్లో ధీమా కన్పిస్తోంది. పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా పెరగడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి పోటెత్తారని ప్రజాకూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.పోలింగ్ సరళి తమకు అనుకూలంగాఉందని గట్టిగా నమ్ముతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టారని ఆ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. 12వ తేదీన ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు కూడా. తాము నియోజకవర్గాల నుంచి తమ శ్రేణులు ద్వారా తెప్పించుకున్న నివేదికల ప్రకారం 75 నుంచి 80 స్థానాలను గెలుచుకోబోతున్నామని ఆపార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
టీఆర్ఎస్ ధీమా అదే....
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా వంద స్థానాల్లో గెలుస్తామని తెలిపింది. చంద్రబాబునాయుడు తెలంగాణ గడ్డ మీద నిలబడి కేసీఆర్ ను తిట్టడంతోనే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వేలాదిగా తరలి వచ్చారని విశ్లేషించింది. ప్రజాసంక్షేమ పథకాలు, నీటి పారుదల ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోతాయోనని ఆందోళన చెందిన ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారన్నది వారి వాదన. గ్రామీణ ప్రాంతాల్లో జనం కేసీఆర్ కే జైకొట్టారని తమవద్ద ఉన్న సమాచారం అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందన్నారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారని తిరిగి అదే సీన్ రిపీట్ కాబోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు.
ఎవరిలోనూ కనపడని....
అయితే రెండు ప్రధాన పార్టీలు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంలో లేవన్నది స్పష్టమవుతోంది. సర్వేలను కొన్నింటిని సమర్థిస్తూ, మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ తమదే విజయమని చెప్పడం తప్ప పూర్తి ధీమా ఎవరిలోనూ కన్పించడం లేదన్నది విశ్లేషకుల అంచనా. రెండు పార్టీలనేతలు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడి సమాచారం సేకరించుకున్నారు.చాలా నియోజకవర్గాల్లో కీ ఫైట్ జరుగుతుందన్నది స్పష్టమైంది. ఈసారి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు సాగిందన్నది మాత్రం వాస్తవం.
కలసినినేతలు...కలవని క్యాడర్....
అనేక నియోజకవర్గాల్లో వందల్లోనే మెజారిటీ లభించే అవకాశాలుకూడా ఉన్నాయన్నది ఒక అంచనాగా తెలుస్తోంది. కొన్ని చోట్ల నేతలకు క్యాడర్ సహకరించలేదన్న సమాచారమూ నేతలకు అందింది. ముఖ్యంగా ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెసేతర పార్టీలు పోటీలో ఉన్న చోట కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కలసి పనిచేయలేదన్న వార్తలు ఆ పార్టీ నేతల్లో కొందరికి ఆందోళనకు గురిచేస్తున్నాయి. పైస్థాయిలో పొత్తు కుదిరినా.. కిందిస్థాయిలో క్యాడర్ ఆ పొత్తును అంగీకరించలేదన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలూ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులకు మాత్రం నిద్ర కరువయిందనే చెప్పాలి. మరి ఎవరు అధికారంలోకి వస్తారన్నది తెలియాలంటే 11వ తేదీ వరకూ ఆగాల్సిందే.
.
- Tags
- indian national congress
- k chandrasekhar rao
- kodandaram
- nara chandrababu naidu
- talangana rashtra samithi
- telangana
- telangana jana samithi
- telangana politics
- telugudesam party
- uttamkumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- తెలంగాణ
- తెలంగాణ జన సమితి
- తెలంగాణ పాలిటిక్స్
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్