ఆ ఎంపీ గోడ దూకేస్తున్నట్లేనా... !!!
చాలా కాలంగా ఆ ఎంపీపై గోడ దూకుడు ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీకి మాత్రం ఎపుడూ ఖండించలేదు. ఇపుడు మాత్రం పెద్ద గొంతు వేసుకుని మరీ నేను పార్టీ మారను గాక మారను అంటున్నారు. మరి. నిప్పు లేనిదే పొగ రాదని అంటారు. ఈ ఎంపీ గారి మీదనే ఎందుకు ప్రచారం జరుగుతోంది. ఆయనే ఎందుకు టార్గెట్ అవుతున్నారు. నిజంగా ఆయన పార్టీ మారతారా..? విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుదు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీ మారుతారన్న ప్రచారం మరో మారు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
వైసీపీలోకేనట...
ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తారని తాజాగా ప్రచారం మొదలైంది. నిజానికి ఇది కొత్త విషయం కానే కాదు. జగన్ గోదావరి జిల్లాల టూర్లో ఉండగా తొలి సారి వచ్చిన మాట ఇది. విశాఖ జిల్లాలో ఈ ఎంపీతో పాటు, మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ గూటిలోకి చేరుతారని. జగన్ విశాఖలో అడుగు పెడితే చాలు వీరే వెళ్ళి కండువాలు కప్పుకుంటారని.ప్రచారం సాగింది.జగన్ పాదయాత్ర దాదాపుగా పూర్తి కావస్తోంది కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా చేరలేదు. పైగా ఎక్కడా ఆ వూసు కూడా లేకుండా టీడీపీ పెద్దలు జాగ్రత్త పడ్డారు. ఇపుడు మళ్లీ ఆ ప్రచారం ప్రారంభం కావడంతో ఆసక్తి పెరిగింది. మరో నాలుగు నెలల్లో ఎటూ ఎన్నికలు రాబోతున్నాయి. ముత్తంశెట్టి వంటి వారు ఇపుడు ధైర్యం కూడ దీసుకుని గోడ దూకేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.
భీమిలీ కోసమేనా....
ఎట్టి పరిస్తితుల్లో భీమిలీ నుంచి పోటీకి ముత్తంశెట్టి సై అంటున్నారు. అక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉండనే ఉన్నారు. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవు కదా. పైగా ఇద్దరినీ సముదాయించడం అధినేత చంద్రబాబు వల్ల కావడం లేదు కదా. దాంతో ముత్తంశెట్టి వేరు దారి చూసుకుంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే దీని వెనక మరో కధ కూడా వినిపిస్తోంది. ముత్తంశెట్టి మీద కావాలనే గిట్టని వారు సొంత పార్టీ నుంచే ప్రచారం నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఆయన్ని అలా బయటకు పంపించేస్తే తమకు పార్టీలో సులువు అవుతుందని అనుకున్న వారే ఈ రకమైన ప్రచారానికి తెర తీశారని అంటున్నారు.
చేరనంటున్న ఎంపీ...
చిత్రమేమిటంటే ముత్తంశెట్టి తాను వైసీపీలో చేరడం లేదని చెప్పకుండా ఇదంతా కేంద్రంలోని మోడీ సర్కార్, బీజేపీ పెద్దలు సాగిస్తున్న ప్రచారం అని కొత్త ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి బీజేపీకి ఈ అవసరం ఎందుకన్న తర్కాన్ని కూడా మరచి ముత్తంశెట్టి వారి మీద తప్పు నెడుతున్నారు. తాను విభజన హామీల గురించి గట్టిగా అడుగుతున్నానని, అందువల్లనే తనను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ముత్తంశేట్టిని జిల్లాకు చెందిన మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెనకేసుకువస్తున్నారు. ఆయన పార్టీ మారరని గట్టిగా చెబుతున్నారు. వైసీపీని మునిగిపోయే నావతో మంత్రి గారు పోల్చుతున్నారు మొత్తానికి ముత్తంశేట్టి పై ప్రచారం రావడంతో ఎంత మంది తమ్ముళ్ళు గోడ దూకుతారన్న సందేహాలు హై కమాండ్ లో మరో మారు మొదలయ్యాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఇది మరింత ఊపందుకుంది.
- Tags
- andhra pradesh
- ap politics
- ayyanna pathrudu
- bhimili constiuency
- ganta srinivasarao
- janasena party
- muthamsetty srinivasarao
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- visakhapatnam district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అయ్యన్నపాత్రుడు
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- గంటా శ్రీనివాసరావు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భీమిలి నియోజకవర్గం
- ముత్తంశెట్టి శ్రీనివాసరావు
- విశాఖపట్నం జిల్లా
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ