బాబు కష్టం ఎవరికీ చెప్పుకోలేనిదా...??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపో్యింది. గత పదిహేను రోజులుగా ఏపీ సర్కార్ ఓవర్ డ్రాఫ్ట్ లో ఉంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆర్థికపరమైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకు సూచించడంతో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కిందా మీదా పడుతున్నారు. జనవరి నెల వచ్చిందంటే చాలు జీతాలు చెల్లింపులకు తోడు, ఇటీవల ఫెదాయ్ తుపాను బాధితులకు నష్టపరిహారాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. దీంతో అప్పుల కోసం మరో చోట వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొరికిన చోటల్లా ఇప్పటికే అప్పులు చేసిన ఏపీ సర్కార్ మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఓవర్ డ్రాఫ్ట్ తో.....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు వద్ద తీసుకున్న మొత్తంతో పాటు, ట్రెజరీ అడ్వాన్సులు ఇప్పటికే 350 కోట్ల రూపాయలు అదనంగా తీసుకుంది. పదిహేను రోజుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ మీదనే సర్కార్ ను నడిపిస్తోంది. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. వివిధ కుల కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు, రాజధాని, పోలవరం నిర్మాణం వంటి పనులను శరవేగంగాచేపట్టాలి. ఇందుకు నిధుల అవసరం ఉంటుంది.
డబ్బులు చెల్లిస్తేనే....
కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తేనే పోలవరం పూర్తి అవుతుంది. పోలవరం అనుకున్న ప్రకారం పూర్తి కాకుంటే వచ్చే ఎన్నికల్లో దెబ్బపడుతుంది. అలాగే రాజధాని నిర్మాణం కూడా ఎంతో కొంత కనపడాలి. దీంతో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలంటే ఇప్పుడు చంద్రబాబుకు కత్తిమీద సామే. అనుకున్న లక్ష్యానికి పూర్తి కాకుంటే ఎన్నికల్లో ప్రజలు ఏవిధంగా వ్యవహరిస్తారోనన్న టెన్షన్ ఉండనే ఉంది. ఇక నెలసరి ఖర్చులు మామూలే. ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు వంటివి ఆపకూడదు. ఇలా ఓవర్ డ్రాఫ్ట్ లో గత పదిహేను రోజుల నుంచి బండిని లాగిస్తున్న సర్కార్ కొత్త అప్పుల కోసం వెదుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది.
తాకట్టు పెట్టాల్సిందేనా.....?
సాధారణంగా ప్రతినెలా కేంద్ర నుంచి వచ్చే పన్నుల వాటాలతో ఓడీ మొత్తాన్ని, వడ్డీ చెల్లింపులను చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. వీటిని అడిగే పరిస్థితి లేదు. ప్రభుత్వం దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకూ వివిధ రకాలుగా చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ పెండింగ్ లోనివే. దీంతో పాటు జనవరి నెల జీతాలు వచ్చి పడుతున్నాయి. దీంతో చంద్రబాబు జలవనరుల కార్పొరేషన్ నుంచి మూడు వేల కోట్ల రూపాయలు రుణంతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జలవనరుల కార్పొరేషన్ కు నాలుగువేల కోట్ల రూపాయలు అప్పు ప్రభుత్వం బకాయీ ఉంది. ప్రస్తుతం మూడు వేల కోట్లు తీసుకుంటే ఒక్క జలవనరుల కార్పొరేషన్ కు ఏడు వేల కోట్లు అప్పు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ ప్రాజెక్టులను తనఖా పెట్టి కార్పొరేషన్లు, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరి ఎన్నికల వేళ అప్పులతో నిండి ఉన్న ఖజానాను ఎలా గలగల లాడిస్తారో చూడాల్సి ఉంది.