కసరత్తు బెడిసికొడుతుందా...?
అవును! టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంపై టీడీపీ సానుభూతి పరులు, మద్దతు దారులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముంగిట చంద్రబాబు చేస్తున్న కసరత్తు బెడిసి కొడితే.. ఇబ్బందులేనని వారు అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న రాజకీయాల మేరకు టీడీపీపై ప్రజల్లో ఉన్న సాను భూతి తాజా పరిణామాలతో ఒకింత ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరి ఆ విషయం ఏంటి? చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అనే విషయాలను పరిశీలిద్దాం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రబుత్వం అధికారంలోకి వచ్చి.. నాలుగున్నరేళ్లు దాటింది. ఈ క్రమంలో రాష్ట్రంలోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రజలకు అనేక వరాలు ఏదో ఒక రూపంలో ఇస్తున్నారు.
పది శ్వేతపత్రాలను....
దీనిని ఎవరూ కాదనలేని పరిస్థితి. పార్టీ నేతలను, ప్రభుత్వ అధికారులను కూడా తిట్టిపోసే ప్రజానీకం.. చంద్రబాబు చేస్తున్న కృషిని ఏమాత్రం వంకపెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. బాబు గ్రేట్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. అయితే, తాజాగా చంద్రబాబు తన ప్రభుత్వ పాలనకు సంబంధించిన వివిధ అంశాలపై వైట్ పేపర్(శ్వేత పత్రాలను) లను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పుడు పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు, ఆర్థిక పరిస్థితి, రైతుల సంక్షేమం, సహజ వనరుల నిర్వహణ, గ్రామాలు-పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యుత్-ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుపరిపాలన సహా మొత్తం 10 శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో విడతల వారీగా విడుదల చేస్తున్నారు.
వరుసగా విడుదల చేస్తే.....
2వ తేదీన రాష్ట్ర పునర్విభజన అంశాలు, అమలుపై వయాడక్ట్ పాంప్లెట్.. 3న ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటు.. 4న సాంఘిక సంక్షేమం, సాధికారత, 100% రేషన్, ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న బీమా, హౌసింగ్, ఉపకార వేతనాలు, ఆదరణ-2, అన్న క్యాంటీన్లు, పేదరికంపై గెలుపు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్.. 5న రైతు సంక్షేమం, ఆహార భద్రత, జడ్బీఎన్ఎ్ఫ, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉబరైజేషన్, ఫుడ్ప్రాసెసింగ్.. 6న గ్రామాలు, పట్టణాల్లో కనీస సౌకర్యాలు, 10 స్టార్, 9 స్టార్ రేటింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఓడీఎఫ్ ప్లస్, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఎల్ఈడీ బల్బులు, రోడ్ కనెక్టివిటీ.. 7న విద్యుత్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాజధాని నిర్మాణ పురోగతి, రోడ్ల అభివృద్ది, 8న మానవ వనరుల అభివృద్ధి, నాలెడ్జ్ స్టేట్గా ఆంధ్ర, విద్య, వైద్యం, పోషకాహారం.. 9న పరిశ్రమలు, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఎంఎ్సఎంఈలు, యువనేస్తం, నూతన ఆవిష్కరణ, సేవా రంగం, ఐటీ, ఐటీఈఎస్, ఫిన్టెక్, టూరిజం.. 10న గవర్నెన్స్, ఆర్టీజీ, ఈ-ప్రగతి, ఈ గవర్నెన్స్, శాంతిభద్రతలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తారు.
నెగిటివ్ మార్కులు పడతాయా?
అయితే, ఈ పరిణామంలో చంద్రబాబు ఊహించినట్టు పాజిటివ్ కన్నా నెగిటివ్ మార్కులు పడేందుకు అవకాశం ఉం టుందని అంటున్నారు. ఒక్కసారి ఈ సందర్భంగా తెలంగాణా సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు చేసిన ఓ ప్రకటనను గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు రెండు మాసాల ముందు.. అక్కడి విపక్షం కాంగ్రెస్ ఇలానే శ్వేత పత్రాల విడుదల కు డిమాండ్ చేసింది. దీనిపై కేసీఆర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తే.. ఏం చెబుతాం.. మేం బాగా పనిచేస్తున్నామని డబ్బా కొట్టుకుంటాం. మళ్లీ వీటిలో తప్పులు వెతికేందుకు ఆ సన్నాసులు(కాంగ్రెస్ నాయకులు) ప్రయత్నిస్తారు. ఈ ఛాన్స్ ఎందుకివ్వాలె! మేం ఏ చేస్తున్నామో.. మాకు తెల్వదా? మా ప్రజలకు తెల్వదా?! అంటూ తోసి పుచ్చారు.
ప్లస్ గా మారవంటున్న....
కానీ.. ఇప్పుడు ఏపీలో మాత్రం బాబు ఏకంగా 10 శ్వేత పత్రాలను అది కూడా ఎన్నికల ముంగిట విడదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ, ఆయన ఊహిస్తున్నట్టు ఇవి ఆయనకు ప్లస్ గా మారే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా ప్రభుత్వం తన లోటుపాట్లను కప్పిపుచ్చి.. శ్వేత పత్రాల్లో అంతా బాగానే చేస్తున్నట్టు చె బుతుంది. దీనిని తమకు అవకాశంగా మార్చుకుని ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం సహజమే. ఇప్పుడు ఉన్నవి చాలక కొత్తగా చంద్రబాబు కొరివితో తల గోక్కుంటారా? అవినీతి జరిగింది.. నిజం, ఇసుక దందాలు నిజం. శాంతి భద్రతల్లో లోపాలు నిజం (ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపేశారు), రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి వీటిని ఇప్పుడు విపక్షాలు తెరమీదికి తెస్తే.. బాబు పరిస్థితి ఏంటి? అనేది వీరి మాట!
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- k.chandrasekharrao
- nara chandrababu naidu
- pawan kalyan
- telangana
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కె. చంద్రశేఖర్ రావు
- జనసేన పార్టీ
- తెలంగాణ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ