నెగిటివ్ గా వెళ్లడమే మేలా...??
ఏపీలో అధికార పార్టీ రాజకీయాలు రోజుకో రంగు పూసుకుంటున్నాయి. ఎలా కుదిరితే అలా మార్చుకునేందుకు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా.. పక్క రాష్ట్రంలోనూ ఏం జరిగినా..దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. చంద్రబాబు వ్యవహార శైలిని అందిపుచ్చుకున్న నాయకులు.. ఆయన వ్యూహాలకు తగిన విధంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం.. ఇప్పటికే ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు.,. ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం అవుతుందని భావించి.. ఇప్పుడు దానిని అందిపుచ్చుకున్నారు.
కాంగ్రెస్ తో జతకట్టినా....
హోదా ఇస్తామంటోంది అనే నెపంతో కాంగ్రెస్తో జట్టుకు ఆయన తెరదీశారు. నిజానికి కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడిన పార్టీని తిరిగి ఆ పార్టీ చేతిలో పెట్టేందుకు చంద్రబాబు అడుగులు వేయడం.. పెద్ద పొరపాటైతే.. దీనికి సమర్ధనగా ఆయన ప్రజాస్వామ్యం కోసం.. జాతీయ స్థాయిలో ప్రజలను కాపాడేందుకు తాము కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమయ్యామని చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఇలా అవకాశం ఉన్న ప్రతి విషయాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు వ్యూహం రచన చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు తెలంగాణా ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం. అతి పెద్దగా పార్టీగా అవతరించిన టీఆర్ ఎస్.. అధినేత కేసీఆర్.. తాను కూడా ఏపీకి వస్తానని.. చంద్రబాబుకు తగిన గిఫ్ట్ ఇస్తానని చెప్పారు.
కేసీఆర్ తో కలిశారంటూ....
ఈ ప్రకటన టీడీపీలో కలవరం రేపింది. ఇక, మరోపక్క, తెలంగాణాలో కేసీఆర్ గెలుపు గుర్రం ఎక్కిన వెంటనే వైసీపీ, జనసేన పార్టీలు పండగ చేసుకున్నాయని కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే.. అటు జగన్, ఇటు పవన్ ఇద్దరూ కూడా కేసీఆర్కు దోస్తులు అయిపోయారని టీడీపీ చెబుతోంది. ఈ విషయంలో టీడీపీ తీవ్రస్థాయిలో జంకుతోంది. వచ్చే ఏడాది జరిగే ఏపీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకూ కేసీఆర్ మద్దతిస్తే.. టీడీపీ ఓటమి ఖాయమని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ, టీడీపీ నాయకులు ఇప్పటికే యాంటి ప్రచారం ప్రారంభించేశారు. ఏపీ విభజనకు కారణమైన కేసీఆర్తో సిగ్గులేకుండా చేతులు కలిపారంటూ.. ఇప్పటికే టీడీపీ నాయకులు జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రచార అస్త్రాలను.....
అంటే .. ఏపీని విడదీసేందుకు కారణమైన కేసీఆర్తో జట్టుకట్టేందుకు జగన్ ప్రయత్నిస్తే(దీనిలో నిజం ఇప్పటి వరకు తెలియదు) అది మహాఘోరంగా టీడీపీ ప్రచార అస్త్రాలను సిద్ధం చేస్తోంది. మరి అసలు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ మాత్రం పవిత్రమైన పార్టీగా నాయకులు చెబుతుండడం దీనిని దేశ రాజకీయాలలో ప్రయోజనం కోసమే పొత్తు పెట్టుకున్నామని చెప్పడం వారికే చెల్లిందని అంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీ రాజకీయాలు ఊపందుకున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- k.chandrasekharrao
- nara chandrababu naidu
- pawan kalyan
- telangana
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కె. చంద్రశేఖర్ రావు
- జనసేన పార్టీ
- తెలంగాణ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ