ఏవీ...ఏవీ వదిలేటట్లు లేరే....?
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు తమ తమ టికెట్ల కోసం కాచుకుని కూర్చున్నారు. నయానో.. భయానో.. బతిమాలో.. బామాలో.. టికెట్లు సంపాయించుకునేందుకు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. అధినేతలను మచ్చిక చేసుకుంటున్నారు. ఇలాంటి వారి జాబితాలో తాజాగా కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈయన గతంలో ఆళ్లగడ్డ నియజకవర్గంపై కన్నేశారు. గత 2014 ఎన్నికల్లోనే పోటీ చేయాలని చూసినా.. అప్పటి నాగిరెడ్డి వద్దని వారించడంతో ఆయనకు అనుచరుడిగా ఉండిపోయారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
గొడవలు సద్దుమణిగాయని.....
ఈ క్రమంలోనే ఆయన తొలుత ఆళ్లగడ్డలో తన ప్రభావాన్ని చూపించాలని అనుకున్నారు. అయితే, ఇక్కడ నుంచి గెలి చిన నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని తీవ్రంగా అడ్డుతగిలారు. ఢీ అంటే ఢీ అనే రీతిలో ఏవీకి ఎదురు నిలిచారు. వీరిద్దరి గొడవ, పంచాయితీ రాజధానికి కూడా చేరడం, ఏకంగా చంద్రబాబు ఇద్దరినీ కూర్చోబెట్టుకుని సరిదిద్దడం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు చంద్రబాబు ఆయనకు నామినేటెడ్ పదవి అయిన ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు చైర్మన్ను చేశారు. దీంతో కొంత మేరకు గొడవలు సర్దుకున్నాయని భావించినా.. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో మరోసారి ఏవీ తన మనసులో మాటను బయట పెట్టారు.
మూడు నియోజవర్గాలపైనే....
సీఎం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి తాజాగా మరోసారి చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఎన్నికల ముం దు శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మూడు నియో జకవర్గాల్లో పర్యటించి కార్య కర్తలకు అండగా నిలుస్తానని అన్నారు. అంటే.. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తనకు పట్టు ఉందని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఒకటి కాకపోతే.. ఒకటైనా తనకు కేటాయించాలనే విషయాన్ని ఆయన పరోక్షంగా చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక, మూడింటిలో చూసుకుంటే.. ఆళ్లగడ్డ, నంద్యాలలో మంత్రి అఖిల ప్రియ ఇప్పటికే పాగా వేశారు. ఒకటి తన తల్లిదని, రెండోది తన తండ్రిదని ఆమె సెంటిమెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
నంద్యాల సీటుకోసమేనా?
శ్రీశైలంలో సుబ్బారెడ్డికి సీటు వస్తుందా ? అన్నది పెద్ద సందేహమే. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భూమా ఫ్యామిలీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఆళ్లగడ్డ, నంద్యాలతో పాటు కర్నూలు సీటును కూడా భూమా బావమరిది అయిన సిట్టింగ్ ఎస్వీ.మోహన్రెడ్డికి సీటు ఇస్తే నంద్యాల, ఆళ్లగడ్డ విషయంలోనూ సిట్టింగ్లనే కంటిన్యూ చేస్తారా ? లేదా వీరిలో ఎవరో ఒకరిని తప్పించి వారికి మదో పదవి ఇస్తారా ? అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నికల టైం దగ్గర పడుతోన్న కొద్ది సుబ్బారెడ్డి సీటు కోసం మూడు నియోజకవర్గాల్లోనూ వేలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చంద్రబాబు సుబ్బారెడ్డి ఫ్యూచర్ ఎలా నిర్ణయిస్తారో చూడాలి.
- Tags
- a.v.subbareddy
- andhra pradesh
- ap politics
- bhuma akhila priya
- janasena party
- kurnool district
- nandyal constiuency
- nara chandrababu naidu
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- ఏవీ సుబ్బారెడ్డి
- కర్నూలు జిల్లా
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నంద్యాల నియోజకవర్గం
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భూమా అఖిలప్రియ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ