Tue Jan 21 2025 18:35:27 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మ వారసత్వపోరులో హల్చల్ చేస్తున్న అజిత్ పేరు
జయలలిత అనారోగ్యం తో అపోలో హాస్పిటల్ లో చేరింది మొదలు తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. అమ్మ కనుసన్నల్లోనే రాజకీయ పాలన కొనసాగుతున్నా ప్రతిపక్షాలు మాత్రం చేతులు కట్టుకుని కూర్చోకుండా తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య విషయాలు బట్టబయలు చెయ్యాలని చూసింది. అయినా జయలలిత తర్వాత రాజకీయ వారసుడిని ప్రకటించమని ప్రభుత్వం పై వత్తిడి కూడా తెచ్చింది ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే. అయితే జయలలితకి వారసులుగా ఇప్పటిదాకా ముగ్గురి పేర్లు ప్రచారంలోకొచ్చాయి. వారిలో ఒకరు జయలలిత స్నేహితురాలు శశికళ కాగా మరొకరు జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వం. ఇకపోతే అసలు రాజకీయాలు అంటే ఏమాత్రం అవగాహన లేని మరో వ్యక్తి పేరు కూడా జయ వారసుడిగా హల్ చల్ చేసింది. అదే సినీ నటుడు అజిత్ పేరు.
అసలు అజిత్ పేరు తమిళ రాజకీయాల్లోకి ఎందుకొచ్చిందో ఎవరికీ అంతుపట్టలేదు. అజితే జయ రాజకీయ వారసుడని మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అయితే చాలామందికి అజిత్ పేరు బయటకెలా వచ్చిందో అర్ధం గాక తలపట్టుకుంటే... మరికొందరు జయలలితకు అజిత్ అత్యంత సన్నిహితుడని అందుకే ఆపేరుని కూడా ప్రచారం చేశారని చెబుతున్నారు.
ఒక పక్క మీడియాలో అజిత్ పేరు మోత మోగుతూనే వుంది మరోపక్క జయలలిత గత సోమవారం రాత్రి కన్ను మూయడం తో జయ వారసుడిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆగమేఘాల మీద జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. అయినా అజిత్ పేరు, శశికళ పేరును మీడియా వదిలి పెట్టలేదు. ఇదంతా ఒక ఎత్తైతే అమ్మని కడసారి చూడడానికి సినీరంగ ప్రముఖులు, సామాన్య జనాలు హాజరవుతుంటే ఆ జనంలో ఎక్కడా అజిత్ గాని అతని ఫ్యామిలీ కానీ కనబడలేదు. ఇదే తమిళనాట చర్చనీయాంశమైంది. మరి అజిత్ ఎందుకు రాలేదో అనిఅందరూ తెగ ఇదైపోతున్న టైములో అజిత్ ఒక్కసారిగా బుధవారం తెల్లవారుజామున మెరీనా బీచ్ సమీపంలో అమ్మ సమాధి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అజిత్ అమ్మ సమాధి దగ్గరికి తన ఫ్యామిలీతో కలిసొచ్చి నివాళులర్పించారు. అయితే అజిత్ ఇంత ఆలస్యం గా రావడానికి కారణం అజిత్ అమ్మ అస్తమించిన సమయం లో చెన్నైలో లేకపోవడమేనట.
అజిత్ తన ‘తలా 57’ సినిమా షూటింగ్ కోసం బల్గెరియాలో ఉండడం వల్ల అమ్మ ఆఖరి చూపు దక్కలేదని అందుకే సమాధి దగ్గర నివాళులర్పించడానికి వచ్చాడని చెబుతున్నారు. బల్గెరియా నుండి బయలుదేరి చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగి నేరుగా అమ్మ సమాధి వద్దకు వెళ్లిపోయారు అజిత్ మరియు షామిలి. ఇక అజిత్ జయ సమాధిని దర్శించుకున్న అనంతరం మరో తమిళ ప్రముఖుడు చో రామస్వామి మరణవార్త విన్న ఆయన రామస్వామికి కూడా నివాళులర్పించేందుకు అపోలో హాస్పిటల్కు వెళ్లారు . ఏదిఏమైనా అజిత్ అంటే జయలలితకు వాత్సల్యం ఉన్నమాట నిజమని చాలామంది వాదిస్తున్నారు.
Next Story