కాకినాడ జిల్లాలో పులి సంచారం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులి సంచారం కలకలం రేపుతుంది
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రత్తిపాడు మండలం ధారపల్లి శివాలయం సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించారు. అర్ధరాత్రి పులి గాండ్రింపులు విని గిరిజన గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పులి సంచారంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు...
ధారపల్లి, తాడువాయి గ్రామాల మధ్య అడవిలో పులి ఉన్నట్లు అటవీ శాఖ అధికారుల వెల్లడించారు. శంఖవరం, ప్రత్తిపాడు మండలాల సరిహద్దు కొండ ప్రాంతంలో పులి కదలికలు గమనించినట్లు తెలిపారు. ప్రతిపాడు, శంఖవరం మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ సిబ్బంది, ఒంటరిగా ప్రజలు ఎవరూ సాయంత్రం నుంచి ఉదయం పది గంటల వరకూ పొలాలకు వెళ్లవద్దని చెప్పారు.